25, ఆగస్టు 2013, ఆదివారం

పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి వారి "శ్రీగురు వైభవం" ప్రవచనం - టీవీ9 లో ఈ రోజు 11 గంటలకు


శ్రీ  గురుభ్యో నమః
పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి "శ్రీ గురు వైభవం" ప్రవచనం టీవీ9 ఛానెల్ లో ఈ రోజు అనగా ఆగస్ట్ 25వ తేదీన,  ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. పూజ్య గురువు గారి అమృత వాక్కులను విని తరిద్దాము.

10, జూన్ 2013, సోమవారం

శ్రీ పరమాచార్య వాణి - భగవంతుడిని ఎందుకు పూజించాలి?


మనకి కనబడుతున్న ఈ విశ్వం అంతా ఒక నియతితో నడుస్తూ ఉంది అంటే, ప్రకృతి శక్తులన్నీ ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్నాయి అంటే, వీటన్నిటికీ వెనుక, వీటిని సృష్టించి నడిపిస్తున్న శక్తి ఒకటి ఉన్నది .. ఆ శక్తిని ఆస్తికులు 'భగవంతుడు' అని అంటారు. మనం చేసే ప్రతీ పనికీ, మనం ఆశించినా/ఆశించక పోయినా ఒక ఫలితం ఉంటుంది. భగవంతుడు మనం చేసే పనులను అనుక్షణం వీక్షిస్తూ, వాటికి తగ్గ ఫలితములను మనకి ఇస్తూ ఉంటాడు.

"సరే భగవంతుడు ఉన్నాడు, ఉంటే మనం ఆయనని ఎందుకు భక్తితో పూజించాలి? మనల్ని అడిగి ఆయన ఈ సృష్టి చేశాడా? అసలు భగవంతుడు మనల్ని సృష్టించబట్టే కదా మనకి ఈ కష్టాలన్నీ. అటువంటప్పుడు, ఆయన పట్ల మనం ఎందుకు భక్తి కలిగి ఉండాలి? ఎందుకు ఆయనని పూజించాలి??" అనేలాంటి ప్రశ్నలు కొందరికి ఉండవచ్చు.


పై ప్రశ్నకి సమాధానంగా, ఆస్తికులు/భగవద్భక్తులు అయిన వారు.."భగవంతుడు మన కష్టాలను/సమస్యలను తీర్చగల సమర్ధుడు" అని చెప్పారనుకోండి, దానికి కూడా ప్రతిగా ..."సరే! భగవంతుడిని పూజిస్తేనే మన కష్టాలు తీరుతాయి అంటే, మీరు చెప్తున్నట్లుగా ఆయన కరుణామూర్తి కాడన్నమాట, కేవలం ఎవరైతే పూజిస్తారో వారి కష్టాలను మాత్రమే తొలగిస్తాడా?" అని కొందరు అడగవచ్చు. అంతేకాదు, "మనం చేసిన పనులకు ఆయన ఫలితములనిస్తాడు అన్నారు కదా, అంటే మనకి ఒక కష్టం వచ్చింది అంటే, మనం ఇంతకు పూర్వం చేసిన పాపములకు ఇప్పుడు ఫలితం ఇస్తున్నాడు, ఇప్పుడు ఆ పాపఫలితం నేను అనుభవించను అని అంటే అది సబబా??" అని కూడా అడగవచ్చు.


శ్రీనీలకంఠ దీక్షితార్ వ్రాసిన 'ఆనందసాగర స్తవం'లో మనపై ప్రశ్నలకి చక్కని సమాధానం ఇచ్చారు. నీలకంఠ దీక్షితార్ ఆ స్తవంలో, మీనాక్షీ అమ్మవారిని ఉద్దేశించి అంటారు, "అమ్మా మీనాక్షీ!! నీకు నేను ఏమీ నోరు విడిచి చెప్పనక్కర్లేదు, నీకు అన్నీ తెలుసు. అయినా నా సమస్యలను నీకు చెప్పకపోతే, నాకు చాలా బాధగా ఉంటుంది, నోరు విడిచి నీకు చెప్పుకున్నంత మాత్రాన, నాకు చాలా తృప్తిగా, ధైర్యంగా ఉంటుందమ్మా. ఈ కారణం వల్లనే, నీకు నా గురించి సర్వమూ తెలిసినా, నా అంతట నేను నా సమస్యలను నీకు విన్నవిస్తున్నాను" అని.


భగవంతుడిని పూజించడం వలన, ఆయన మన సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడా, లేదా మనం చేసిన కర్మలకి మనకి ఏ ఫలితం రావాలో ఆ ఫలితాన్ని అలాగే ఇస్తాడా లేక మనం ఏదైతే పాపఫలితాన్ని అనుభవించాలో, దానిని తట్టుకునే స్థైర్యాన్ని ఇస్తాడా... అనేది వేరే విషయం, మొదటగా మనం భగవంతుడికి మన సమస్యలని విన్నవించుకోవడం వలన, మనకి ముందు కొంత ప్రశాంతతనిస్తుంది.


కానీ, నిజానికి ఈశ్వరుని యందు మనకి ఉండవలసిన భక్తి అనే విషయమై మాట్లాడితే, మన సమస్యలకు పరిష్కారం కోసం మాత్రమే ఈశ్వరుడిని పూజించాలి అనేది సరికాదు. అలాకాకుండా, ప్రస్తుతం మనకి సుఖమయ జీవితాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతని ఆవిష్కరించడానికి కూడా కాదు ... ఈశ్వరుడిని పూజచేయవలసినది. ఎందుకంటే, నారు వేసిన వాడే నీరు పోస్తడు అని చెప్పినట్లుగా, నన్ను సృష్టించినవాడికి నాకు ఎప్పుడు ఏమి అవసరమో తెలుసు, అలా అవన్నీ ఇవ్వడం ఆయన యొక్క కర్తవ్యం, ఇందులో ఆయనకి నేను కృతజ్ఞత చెప్పేది ఏముంది? అనే భావన ఉన్నవారు కూడా కొందరు ఉండవచ్చు. కాబట్టి, మనకేదో ఈశ్వరుడు ఇచ్చాడు, మనం సుఖంగా ఉన్నాం కాబట్టి, కృతజ్ఞతా భావంతో పూజచేయాలి అనేది కూడా సరికాదు, అలాగే మన సమస్యలను తీర్చేందుకే భగవంతుడిని పూజించాలి అనేది సరికాదు.


సుఖము, కష్టము అనేవి రెండూ మనసుని ఎప్పుడూ కదిలిస్తూ ఉంటాయి. అందుకే పైన చెప్పిన సుఖములలో లేక కష్టములలో భగవంతుడి పట్ల భక్తి అనే ఉద్దేశ్యంలో నేను మాట్లాడడం లేదు. ఎక్కడైతే మనసు స్థిరముగా, ప్రశాంతముగా ఉంటుందో అదే నిజమైన శాశ్వతమైన ఆనందం. మిగతా సంతోషాలన్నీ శాశ్వతము కావు. మనం బాగా గాఢమైన నిద్ర(సుషుప్తి)లో ఉన్నప్పుడు లేక మానసిక ఉన్మాదం వంటివి ఉన్నప్పుడు కూడా ఎటువంటి సుఖము లేక కష్టము రెండిటినీ మనం అనుభవించము. సంపూర్ణ ఆనంద స్థితిలోనే ఉంటాము, కానీ అలా సుషుప్తిలో, మనం పొందే ఆనందం మనకి ఎరుకలో (being aware) ఉండదు. మనం మెళకువగా ఉన్నప్పుడు, మనసులో ఏ ఇతర ఆలోచనలూ లేక, సంపూర్ణమైన ఎఱుకతో, మనం ఆ ప్రశాంతతని అనుభవించాలి. కానీ అలా మనం గమనిస్తూ ఉండగ, ఆ శాశ్వతమైన ప్రశాంతత పొందాలి అంటే, మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. కానీ మన మనసులో ఒకదాని వెంట మరొక ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఈ ఆలోచనలు మనలో పుడుతున్నంత సేపూ, 'జీవుడిగా' నేను వేరు, పరమాత్మ వేరు అనే భావన మాత్రమే మనకి ఎరుకలో ఉంటుంది. మనస్సు నిశ్చల స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే జీవాత్మ/పరమాత్మల భేదాలు తొలగిపోతాయి. అటువంటి నిశ్చల స్థితిలో పరమాత్మ తప్ప వేరుగా ఏదీ లేదు అనే అద్వైత స్థితిని అనుభవిస్తాము. ఆ స్థితిని చేరుకోవాలంటే, ఏదైతే/ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, దానిని తదేక దీక్షగా ధ్యానం చేయాలి. మనం దేనినైతే ధ్యానం చేస్తూ ఉంటామో, కొన్నాళ్ళకు దానిగానే మారిపోతాము. ఈ విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించినది. ఈ విధముగా, ప్రశాంతమైన, ధ్యాన యోగ్యమైన అద్వైత స్థితిలో ఉన్నది సాక్షాత్తు భగవంతుడే.


సృష్టి, స్థితి, లయములు చేస్తూ, కర్మ ఫలితాలనిచ్చే భగవంతుడు ఎప్పుడూ డస్సిపోడు, బ్రహ్మానంద స్థితిలోనే ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడి నామాలలో స్థాణుః అనే నామం ఉన్నది. స్థాణువు అనగా ఇక కదలడానికి వీలులేనంతలా అంతటా వ్యాపించిపోయిన వాడు అని ఒక అర్ధం, అలాగే, ఒక చెక్క దుంగ అనే ఒక అర్ధం కూడా ఉన్నది.  లోపల జీవం ఉన్న దుంగ పైకి జీవం లేనట్టుగా కనబడుతుంది. అటువంటి స్థాణువైన చెక్కదుంగని ఒక లత అల్లుకుంటుంది, ఆ లతయే అమ్మవారు. స్థాణువుగా ఉన్న ఈశ్వరుడిని, ఆకులు లేని లత అయిన అపర్ణగా అల్లుకుని ఉంటుంది. భగవంతుడిని గురించి మనం ఎప్పుడు ఆలోచించినా జ్ఞానము + శాంతి అనే విషయాలు మన ఆలోచనకి వస్తాయి. అందువల్లనే భగవంతుడిని మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే, మనకి జ్ఞానము+శాంతి కలుగుతాయి.


ఒక వ్యక్తి ప్రారంభ దశలో, తన కష్టాలను భగవంతుడికి విన్నవించుకుని ఆ కష్టాల నుండి బయటపడినా, లేక భగవత్కృపతో సుఖమయ జీవనాన్ని గడపుతున్నందుకు భగవంతుడికి ప్రతీ రోజూ పూజ చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, అటు కష్టములోనూ, ఇటు సుఖములోనూ, భగవంతుడికి విన్నవించుకోవడం అనేది ప్రాథమిక దశ. ఇలా భగవత్ చింతన అలవాటైన కొద్దీ, మన మనసు నెమ్మది నెమ్మదిగా ఈ కష్టముల వల్ల కలిగే బాధ నుండీ, మరియు సుఖముల వల్ల కలిగే ఆనందము నుంచీ, రెండిటి నుండీ విడివడడం మొదలవుతుంది. భగవంతుని యందు మనసు పెట్టి, సాధన పెరుగుతున్న కొద్దీ, పోను పోను అన్నీ ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నాయి, అన్నీ ఈశ్వరుడే చూసుకుంటాడు అని, తనకి కష్టం వచ్చినా, సుఖమే వచ్చినా రెండిటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు. ఒకవిధమైన ఆనందము, శాంతి కలగడం ప్రారంభం అవుతుంది. ఒక కష్టానికీ కృంగి పోడు, సుఖానికి పొంగిపోడు, అన్నిటినీ ఈశ్వరుడే ఇస్తున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే శరణాగతి బుద్ధి అలవడుతుంది. ఇదే, మనల్ని ఆత్మోన్నతివైపుకి నడిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం వల్ల, మనకి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది.


కేవలం ఆత్మ విచారణ, ధ్యానము, యోగము ద్వారానే మన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు ఉన్నప్పుడే, పూర్ణమైన ఆత్మానందస్థితిని ఎఱుకతో అనుభవించగలుగుతాము. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చు, "ఈ ఆత్మ విచారణ, ధ్యానము, యోగము అనే ప్రక్రియలు ఎలా చెయ్యాలో చెప్పకుండా, మీరు భగవద్భక్తి గురించి, భగవంతుడిని ఎందుకు పూజించాలి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?". ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు, ఏ స్థితిలో అయితే ఏ చలనము, ఏ ఆలోచనా, కనీసం భక్తి అనే ఆలోచనా కూడా ఉండవో ఆ స్థితియే 'మోక్షస్థితి'. అప్పుడు "మరి భగవంతుడిని పూజించమని ఎందుకు చెబుతున్నారు?" అని మీరు నన్ను అడుగవచ్చు. దీనికి సమాధానం శంకరులే మనకి చెప్పి ఉన్నారు. మోక్షం పొందే సాధనా మార్గాలలో భక్తి మార్గం సర్వోత్కృష్టమైనది అని. అయితే ఈ భక్తి అంటే ఏమిటి? దేనిని భక్తి అంటారు? దీనికి కూడా సమాధానం శంకరులే మరుసటి వాక్యంలో చెప్పి ఉన్నారు, 'నిజమైన నేను (enquiring into the real nature of self) ఎవరో విచారణ చేయడంలో నిమగ్నమై ఉండడమే భక్తి' అని శంకరులు చెప్పారు. శంకరుల నిర్వచనం ప్రకారం, భక్తి అనేది కేవలం ఆత్మవిచారణ, ధ్యానము, యోగము ద్వారానే సాధ్యము తప్ప మనం సాధారణంగా ఇప్పటి వరకూ అనుకునే భక్తి... అనగా భగవంతుడు అనేవాడు బయట ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్ల మనం చూపే ప్రేమనే భక్తి.... అని మనం అనుకునేది అసలు భక్తి కాదు.


సరే, భక్తి అంటే ఏమిటో పైన చెప్పిన నిర్వచనం స్వయంగా శంకరులే ఇచ్చి ఉన్నా కూడా, మా పీఠములలో (కంచికామకోటి పీఠం, మరియు ఇతర శంకరాచార్య ప్రతిష్టిత పీఠములు) చేయవలసిన చంద్రమౌళీశ్వర ఆరాధనా పద్ధతిని వారే ప్రారంభించారు. నిర్గుణమైన పరబ్రహ్మమే మన అంతిమ లక్ష్యము అని శంకరులే ప్రకటించినా కూడా, వారే ఆరు భగవదారాధనా పద్ధతులను స్థాపించడం వల్ల వారికి షణ్మత స్థాపనాచార్య అనే నామం కూడా వచ్చింది. వారు మన దేశంలో కాలుమోపని పుణ్యక్షేత్రం లేదు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించారు. అనేక దేవతా స్వరూపాలను స్తుతిస్తూ ఎన్నెన్నో స్తోత్రాలను ఇచ్చారు. దీనిని బట్టీ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఏదైతే భగవదారాధానా/పూజా పద్ధతులు ఉన్నాయో (వేటిని మనం భగవద్భక్తి అనుకున్నామని చెప్పానో..), ఈ పూజా విధానాలకు శంకరుల అనుమతి ఉన్నది. కాబట్టే కదా వారే స్వయంగా అన్ని స్తోత్రాలు ఇవ్వడం, అనేక క్షేత్రాలలో వారు పర్యటించడము, ఆఖరికి వారు ప్రతిష్టించిన పీఠాలలో కూడా నిత్య చంద్రమౌళీశ్వరారాధనా క్రమాన్ని ప్రారంభించి, పరంపరాగతంగా కొనసాగుతూ ఉండడం వస్తున్నది.


జ్ఞానమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధనా ఫలితముగా చాలా మందికి ఒక భావన ఉన్నది. అలాగే జ్ఞానము కన్నా ఓ స్థాయి తక్కువగా ఆత్మ విచారణ, ధ్యానము, యోగము, దానికన్నా క్రింద స్థాయిలో పూజలు చేయడము, పుణ్యక్షేత్రములను దర్శించటము అనీ, అన్నిటికన్నా క్రింద స్థాయిలో వైదిక క్రతువులు, కర్మకాండ చూడబడుతూ ఉన్నది. చాలా మంది చదువుకున్న వారిలో కూడా, వైదిక క్రతువులంటే కేవలం మూఢనమ్మకాలు అనే స్థిరమైన అభిప్రాయము, పూజాధికములు నిర్వహించడం ఒక మానసిక భావము (sentiment) గానూ, ధ్యాన/యోగములు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అనీ ఒక ప్రగాఢ విశ్వాసం ఉన్నది.


ఆదిశంకర భగవత్పాదులంతటి వారు, సాక్షాత్ కైలాస శంకరుడే ఆదిశంకరుడిగా వచ్చినా, వారు స్వయంగా ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండే మహాపురుషుడే అయినా, కర్మకాండతో పాటు జ్ఞాన మార్గము కూడా అవసరం అని చెప్పినా..... శంకరులే మనసు+క్రియ కలిపి చేయవలసిన భగవంతుడి పూజ, వైదిక కర్మలను కూడా సమ్మతించారు. దీనికి కారణం ఉన్నది. సంసారంలో మమేకమై ఉన్న మనందరికీ, మనసు ఎప్పుడూ నిరంతర ఆలోచనలతో అలజడికి గురై ఉంటుంది. అటువంటి మనసును ఒక్క క్షణమైనా నిశ్చలంగా ఉంచడం చాలా కష్టం. అలాగని, మన ప్రయత్నంతో మనసులో వచ్చే ఆలోచనలను అరికట్టి, నిశ్చల పరుద్దాం అని అనుకున్నా, అది అత్యంత కష్టమైన విషయం. ఆలోచనలు అదేపనిగా మన మనసుని అన్ని దిశల నుండీ తాకుతూనే ఉంటాయి. మనకి సంసారంలో ఉన్న బంధాలు, వ్యక్తులతో ఉన్న విరోధాలు, బాధలు, భయాలు, సంతోషాలు అన్నీ ఒకదాని వెనుక ఒకటి మనల్ని అలల్లా తాకుతూ, మనల్ని ఒక సందిగ్ధావస్థలో ఉంచుతాయి. దీని కారణంగానే, "మనసుని నిశ్చలముగా ఉంచుకొనుము, తద్వారా ఆత్మనందము పొందగలవు" అని చెప్పడం తేలిక, ఆచరణలో దానిని సాధించడం అంత తేలిక కాదు.


మన మనస్సును నిశ్చలముగా, ఎటువంటి ఆలోచలు లేకుండా నిలపలేక పోవడానికి కారణం ఏమిటి?


మనం పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితమే దీనికి కారణం. జన్మ తర్వాత జన్మ, ప్రతీ జన్మలోనూ మనం ఏవో కొన్ని పాపములు చేస్తూ వచ్చాము. జన్మజన్మాంతర ఆ పాపరాశి ధ్వంశం అయితే తప్ప, మనం ఆత్మ దర్శనం పొందలేము. అటువంటి స్థితిని చేరుకోవాలంటే, మన కర్మలన్నిటికీ ఫలితాలనిచ్చే ఈశ్వరుడు, మన పాపములన్నిటికీ మన చేత శిక్ష అనుభవింప చేసిన తర్వాత మాత్రమే సాధ్యము. పాపము ఇచ్చే ఫలితము ఎలా తుడిచిపెట్టుకుపోతుంది? పుణ్యములు చేయడం ద్వారా. పుణ్య కార్యములు చేయడం వలన, ఈ జన్మలో అన్ని పాపములు అనుభవించలేక పోతే, మళ్ళీ ఇంకొక జన్మలో, ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపతో ఇంకో శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ కొత్త శరీరంతో ఇతఃపూర్వం ఉన్న పాపరాశి మళ్ళీ కొంత అనుభవించగలుగుతాడు. కానీ మనం ఏమి చేస్తున్నాము? గత జన్మలలో ఉన్న పాపములను అనుభవించడమే కాకుండా, ఈ జన్మలో మళ్ళీ కొత్తగా పాపములను చేస్తూ, మన పాపముల చిట్టా రోజు రోజుకీ పెంచుకుంటున్నాము. ఇలా మనం అజ్ఞానంతో పాపములను తగ్గించుకోవడం మానేసి, గుణాత్మకంగా పాపములను పెంచుకుంటున్నాము అనే, జగద్గురువులైన శ్రీఆదిశంకర భగవత్పాదులు, జ్ఞాన మార్గముతో పాటు, వైదిక కర్మలను చేయడం, భగవంతుడిని పూజ చేయడం వంటి కూడా తప్పనిసరి అని సూచించారు.

పాపములు రెండు రకములు. ఒకటి కాయకముగా చేసిన పాపములు, రెండు మానసికముగా చేసిన పాపములు. కాయకముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, కాయకముగా పుణ్య కార్యములు చెయ్యాలి. అలాగే మానసికముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, పుణ్యప్రదమైన ఆలోచనలు/సత్సంకల్పాలు చేస్తూ ఉండాలి.


పుణ్య కార్యం అంటే ఏమిటి? - వేదం వేటిని చేయమని చెప్పినదో అవి అన్నీ పుణ్యకర్మలు. సమాజంలో అందరికీ ఒక్కో కర్తవ్యాన్ని వేదం నిర్దేశించినది. వేదశాస్త్రములు చెప్పినట్లుగా, ఈ వేదవిహిత కర్మాచరణలో వైక్లవ్యం కలుగకుండా, ఎవరి స్వకర్మలు వారు పాటించడం చేస్తే, అన్నిటికన్నా అదే పెద్ద పుణ్య కార్యం.


పాపకార్యం అంటే ఏమిటి? ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది.

స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా,
 వేదము చెప్పిన కార్యములను, విివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి.

వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు 
పవిత్రమవుతుంది.

ఏ పనీ చేయకుండా కూర్చుని ఉంటే, అనేక విధములైన చెడు ఆలోచనలు మనసులో పుడుతూ ఉంటాయి. అందువలననే మన మననుని నిశ్చల స్థితిలోకి (ఎటువంటి ఆలోచనలు లేకుండా) తీసుకువెళ్ళి, ఆపైన అద్వైత దర్శనం చేయాలి అంటే, ముందు మన మనసులో కలిగే చెడు ఆలోచనలు ఆగి, మనసు పునీతం కావాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన ప్రాథమిక స్థాయిలో ఉండగా, మనసుని పవిత్రం చేయడం అనేది కేవలం వైదిక కర్మలు, పుణ్య కార్యముల చేత మాత్రమే సాధ్యము. ఈ కారణంగానే, శంకరులు వైదిక కర్మలను చేయమని ప్రతిపాదించి, వివిధ దేవతాస్వరూపాలను కీర్తించే స్తోత్రాదులు ఇచ్చారు.


ఇతరులకు సహాయం చేయడము, సమాజ సేవ చేయడం, మనకున్న విభూతిని సమాజం కోసం వెచ్చించి త్యాగం చేయడం వంటి పుణ్య కర్మలు మనలోని పాపపు ఆలోచనలను తగ్గిస్తుంది. దీనినే మనం ప్రేమ అనవచ్చు. ఇదే ప్రేమని పరమాత్మ వైపుకు త్రిప్పగలిగితే, పరమాత్మపై మనకి ఉండే ఆ ప్రేమనే 'భక్తి' అంటారు. భగవంతుడి యందు ఉండే భక్తి, భగవత్ చింతన అనేవి, అనేక జన్మల పరంపరగా మనం చేసిన పాపాలను సమూలంగా నాశనం చేయగలదు. భగవద్భక్తి ఒక స్థాయి చేరిన తర్వాత, మన మనసు కేవల పరమాత్మపైనే దృష్టి పెట్టే స్థితి వస్తుంది. మనసులో అసలు ఏ ఆలోచనలూ లేకుండా నిశ్చల స్థితిలో ఉండగలడం అనే నిశ్చల సమాధి స్థితికి ఒక మెట్టు ముందు కేవల భగవత్ చింతన ఉండే స్థితి అబ్బుతుంది. మరే ఇతర ఆలోచనలు లేక కేవలం పరమాత్మ చింతనయే మనసులో మిగిలిన వాడికి, అనతి కాలంలోనే, ఇక ఏ ఆలోచనాలేని, పరమాత్మ స్థితిలో నిలబడే స్థితి వస్తుంది. అంత్యమున పరమాత్మ తప్ప మరేది ఉండదు.

పైన చెప్పిన విధంగా, మన మనసు ఒకే ఒక్క విషయంపై (భగవత్ చింతన) ఏకాగ్రత పొంది, ధ్యాన యోగ స్థితిని చేరడం కోసమే, శంకర భగవత్పాదుల వారు మనకి వైదిక కర్మలను (నిత్య నైమిత్తిక కర్మలు, భగవంతుడి పూజ) తప్పనిసరిగా చేయాలనీ, భగవంతుడి యందు భక్తి కలిగి ఉండాలనీ బోధించారు.

మొదట స్తోత్రాదులను పఠించడమూ, పూజ చేయడమూ, పుణ్యక్షేత్రములను సందర్శించడమూ మొదలైన వాటితో భగవద్భక్తి ప్రారంభం అవుతుంది. భక్తితో, వైదిక కర్మలు చేస్తూ ఉంటే, పరమాత్మ అనుగ్రహంతో శాంతి పొందుతాము. నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడులా కాకుండా, మనం మెళకువగా ఉన్నప్పుడే, మన మనసు జాగురూకతతో ఉన్నప్పుడే (fully concious state), భగవద్భక్తి మనల్ని పరమాత్మకి దగ్గర చేస్తుంది. అందువలననే, ప్రతీ ఒక్కరూ భక్తిని అలవరచుకుని, శాస్త్రం విహించిన వైదిక కర్మాచరణ చేయడం అభ్యసించాలి.

కేవలం 'అద్వైతం' అనే స్థితిని గూర్చి మాట్లాడుతూ ఉండడం వలన ఏమీ ప్రయోజనం లేదు. అద్వైత స్థితికి సాకారరూపం ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని గురించి ధ్యానిస్తూ ఉండడం వలన, అప్పుడప్పుడైనా తాత్కాలిక ప్రశాంతని పొందగలము. మనకి అర్ధం కానీ, మనం ప్రేమతో అనుబంధం పెట్టుకోలేని ఆ స్థితిని, మనం ఊహకూడ చేయలేని మరియు ఏ గుణములూ లేని నిర్గుణ పరబ్రహ్మ అద్వైత స్థితిని గురించి మాట్లాడే కన్నా, సగుణరూపములో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని పూజ చేయడం చాలా చాలా అవసరం, సగుణ  పరబ్రహ్మము నందు మన మనను త్వరగా లయం అయి, మనకి ఈశ్వరుని యందు భక్తి బాగా కుదురుకుంటుంది. అటువంటి సగుణరూప పరబ్రహ్మమును పరమభక్తితో పూజించడం చాలా అవసరం.

చివరగా చెప్పేది ఏమిటంటే, "భక్తి అనేది కేవలం లౌకికమైన ఈతి బాధలు తీరడానికి కాదు. మనం ఎవరో, మన స్వస్వరూపమేమిటో తెలుసుకొని, నిజమైన 'నేను'లో రమించి శాంతిని పొందుట కొరకు మాత్రమే భక్తి".



(తమిళంలోని దైవదిన్ కురళ్ - Voice of God అనే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల పుస్తకము నుంచి సంగ్రహించినది).

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

6, జూన్ 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - కట్నం తీసుకోవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు


"శాస్త్రం చెప్పిన వైదిక కర్మలు చేయడానికి అమితమైన డబ్బు అవసరం లేదు, అలాగే పూజ చేయడానికి పెద్ద హంగులు, ఆర్భాటమూ కూడా అవసరం లేదు. కేవలం ఎండిపోయిన తులసి ఆకులు, మారేడు దళాలు నాలుగు ఉన్నా, పూజ చేయవచ్చు. మనం రోజూ తినడానికి వండుకునే అన్నమే నైవేద్యంగా నివేదించవచ్చు.
'ఈ రోజుల్లో వివాహం అనగానే చాలా చాలా డబ్బు దాని కొఱకు వెచ్చిస్తున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏమిటి' అని కొందరడిగారు. దానికి నా సమాధానం -  'శాస్త్రం ప్రకారం వివాహము కూడా ఒక వైదికమైన క్రతువు. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా, వివాహము అమితమైన వ్యయంతో కూడుకుని చేయమని మన ఏ శాస్త్రాలలో కూడా చెప్పలేదు. అనగా వివాహం పేరు మీద అంతంత డబ్బు ఖర్చు చేయడానికి శాస్త్రం అంగీకరించలేదు. అందునా ప్రత్యేకంగా వివాహ క్రతువులో, కట్నం తీసుకోవడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధము, మన శాస్త్రాలు కట్నం తీసుకోవడాన్ని అంగీకరించలేదు".

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.



4, జూన్ 2013, మంగళవారం

శ్రీ పరమాచార్య వాణి - శాస్త్రవిహిత జీవన విధానమే శాంతికి మూలం


"మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక/పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని, అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది. శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి".

"తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యావ్యవస్థితౌ"

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

30, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతీ


"మనందరమూ జీవితములో జ్ఞానం సంపాదించడానికి తపన పడాలి. ఒక్క జ్ఞానముతో మాత్రమే మనము ఎటువంటి కష్టాలనైనా, బాధలనైనా ఓర్చుకుని సహించగలము.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, మానవ జన్మ ఎత్తినందుకు, ప్రతీ ఒక్కరికీ సుఖాలతో పాటు, కష్టాలు కూడా జీవితములో ఉండి తీరుతాయి. బాగా ఐశ్వర్యం కలిగిన వాడో లేక పదవులలో బాగా ఉన్నత స్థానం చేరుకున్నవారినో చూసి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాము, వారు ఎంత సుఖపడుతున్నారో, వాళ్ళకి అసలు కష్టాలే లేవు అని. అలా అనుకుని, మనం కూడా జీవితములో చాలా సమయాన్ని ఈ ధనము/కీర్తి/పదవుల వేటలోనే వెచ్చిస్తున్నాము. యథార్ధంగా, అటువంటి ఐశ్వర్యవంతులను, లేదా పెద్దపెద్ద పదవులలో ఉన్నవారిని అడిగితే, వాళ్లకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తాయి.

నిజానికి, ప్రతీ మనిషీ తనకున్న కష్టమే అందరి కష్టం కన్నా పెద్దది అనుకుంటూ ఉంటాడు, కాబట్టే, ఒక కష్టం రాగానే, ఇతరుల నుంచి సానుభూతి కోరుకుంటూ ఉంటాడు. అసలు మనం పుడుతూనే, మనం ఈ జన్మలో ఏ ఏ కష్టాలు అనుభవించాలో, మన పూర్వ కర్మానుసారం, నిర్ధారితమై పుట్టాము. అంటే, ప్రతీ ఒక్కరికీ కష్టములు తప్పవు. అయితే, ఈ కష్టాలను తట్టుకోగలగడం అనేది, కేవలం జ్ఞానం పొందడం వల్ల మాత్రమే సాధ్యము".

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి !!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత

"గురుగుహా" అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. గురుగుహ అనే నామానికి స్థూల సూక్ష్మ కారణ అర్ధాలు మూడు ఉన్నాయి.

మొదటి స్థూల అర్ధం - గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురుస్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ - హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు.

శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ 'గురుగుహా' అనే మకుటంతో ఉంటాయి. అది ఏ దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి చేసిన కీర్తన అయినా సరే, గురుగుహా అనే నామం ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు. ఒకనాడు, ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గారు, ఒకనాడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితార్ గారిని పిలిచి, కళ్ళుమూసుకుని, నదిలో మునిగి, చేతికి తగిలిన వస్తువు తీసుకోమని చెప్తారు. అప్పుడు దీక్షితార్ గారికి నదిలో ఒక అద్భుతమైన వీణ లభిస్తుంది, గురు అనుగ్రహం కలగడం చేత గంగా నది ఆయనకి ఆ వీణ బహూకరించినది. ముత్తుస్వామి దీక్షితార్ గారికి దొరికిన ఆ వీణ చాలా విలక్షణమైనది, అందులో యాళి పైకి ఉంటుంది. ఇక అలాంటి వీణ మరెక్కడా లేదు. ఇది జరిగిన తర్వాత ఆయన గురువు గారు శరీరం విడిచి, శివ సాయుజ్యం పొందుతారు. చివరలో ఆయన గురువైన శ్రీ చిదంబరనాథ శాస్త్రి గారు, తదనంతరం ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణి వెళ్లమని ఆదేశిస్తారు.

అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ దక్షిణదేశం బయలుదేరి తిరుత్తణి అనే ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకుంటారు. తిరుత్తణి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా, అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అక్కడికి వచ్చి ...."ముత్తుస్వామి దీక్షితార్!! ముత్తుస్వామి దీక్షితార్!! ఏదీ నీ నోరు తెరు..." అని ఆయన నోటిలో పటిక బెల్లం వేస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ గారు కళ్ళు తెరిచి చూసే సరికి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్యుడు కనబడడు. అంతే అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఆయన నోటి నుండీ సుబ్రహ్మణ్యుడిపై అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. వాటినే తిరుత్తణి కీర్తనలు అంటారు. ఇలా సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రత్యక్షంగా పొందినందుకు, ఆయన కీర్తనలన్నిటిలోనూ, 'గురుగుహా' అనే మకుటం వేసి కీర్తనలు చేశారు దీక్షితార్. దీక్షితార్ గారు కాశీలో ఆయన చేసిన గురు శుశ్రూషకి మెచ్చిన సుబ్రహ్మణ్యుడు దీక్షితార్ కి అఖండమైన సంగీత పరిజ్ఞానాన్ని కటాక్షించాడు. అందుకే ముత్తుస్వామి వారు తిరువారూర్ లో చేసిన పంచలింగ కృతులలో ఒక కృతిలో ఇలా అంటారు.."జ్ఞాన ప్రదాన గురుగుహ రూప చిదానందనాథ స్వరూప ప్రకాశేన" అని. అంటే ఆయన గురువు చిదానందనాథ స్వామి వారే గురుగుహుడు అని.

"గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు, సర్వ జీవుల హృదయములో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడు, ఆయనయే గురు స్వరూపం. సుబ్రహ్మణ్యుడు గురువుగా కేవలం ముత్తుస్వామి దీక్షితార్ గారికే కాదు, సాక్షాత్తు శంకరుడికి కూడా గురువుగా ప్రణవార్ధం బోధించాడు. అందుకే ఆయనని స్వామినాథ అని కూడా అంటారు. ఇక్కడ శంకరుడికి తెలియదా ప్రణవార్ధం, సుబ్రహ్మణ్యుడు బోధించాడు అంటే అది శంకరుడికి అవమానం కదా అని అనుకోకూడదు. ఏ తండ్రికైనా తన పుత్రుడి చేతిలో పొందిన ఓటమి మరింత ఆనందాన్నిస్తుంది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు కదా. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు సంపూర్ణ గురు తత్త్వంతో కూడిన సర్వ జీవుల జీవుల హృదయాలలో ఉన్నవాడు కనుక "గురుగుహ".

రెండవ సూక్ష్మ అర్ధమ్ -
గురు అంటే బాగా పెద్దదైన, గుహా అంటే చాలా చిన్నది సూక్ష్మమైనది. అంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్దదైన వాడూ ఆయనే, అన్నిటికన్నా చిన్నదైన పరమాణువు స్వరూపం ఆయనే, అంటే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని అర్ధం, దీనినే అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అని విష్ణుసహస్రంలో ఉంది, అన్నిటికనా బాగా పెద్దది, బాగా చిన్నది, బాగా చిక్కినది, బాగా లావైనది, అన్ని గుణములు కలవాడు, ఏ గుణములు లేనివాడు అని కదా. అంటే పరబ్రహ్మ తత్త్వాన్ని చెప్పడం.
దీనినే భగవద్గీతలో "కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్" అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా.

మూడవ కారణ అర్ధం -
గురుగుహా అంటే - గురు అంటే నిర్గుణమైన పరమశివునికి సంకేతం, గుహా అంటే గుహ్య శక్తి అయిన అమ్మవారికి సంకేతం, అమ్మ అయ్యవార్ల క్రీడా ఫలితం గురుగుహా. ఈ విశ్వం అంతా కూడా నిర్గుణమైన పరమశివుని మరియు గుహ్యమైన శక్తి స్వరూపిణి యొక్క క్రీడగా వర్ణించారు. అమ్మ అయ్యల క్రీడయే గురుగుహా, అందుకే స్కందః అని కూడా అన్నారు స్వామిని, స్కంద అంటే జారి పడినది అని అర్ధం. ఇక్కడ జారి పడడం అంటే source కి, destination కి లింక్ తెగిపోదు, ఉదాహరణకి సూర్య కిరణాలు. సూర్యుని కిరణాలు సూర్యుని నుంచి బయలు దేరి భూమిని తాకుతాయి, అంతే కానీ అక్కడ ఒక కిరణం బాణంగా బయలుదేరి భూమిమీద పడదు. సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అందుకే ఆదిత్య హృదయంలో కూడా శివః స్కందః ప్రజాపతిః అని సూర్యుని నామాలలో కూడా స్కంద నామం వచ్చింది.


సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

29, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురుభక్తి ప్రాశస్త్యం


"వేదాంత దేశికులు, తమ గురువుని భగవంతుడి కన్నా అధికంగా భావించేవారు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడినది - ఈశ్వరుడు కనుక ఆగ్రహిస్తే, గురువు రక్షించగలుగుతాడు, కానీ గురువే ఆగ్రహిస్తే త్రిమూర్తులలో ఎవరూ రక్షించడానికి ముందుకు రారు. మనం సంపూర్ణ అంకిత భావముతో, విశ్వాసముతో, ఎటువంటి భేషజములు లేకుండా గురువు వద్ద శరణాగతి చేస్తే, గురువే మనల్ని దుఃఖముల నుండి రక్షించి, మోక్షమార్గం చూపిస్తాడు. కానీ ఈ రోజులలో గురుభక్తి కొరవడడం వలన ఈశ్వరుని యందు భక్తి కూడా జనుల హృదయాలలో తగ్గిపోతోంది".

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

28, మే 2013, మంగళవారం

శ్రీ పరమాచార్య వాణి - జీవితం యొక్క లక్ష్యం ఎలా నిర్ణయించుకోవాలి


"సూర్యునికి అభిముఖంగా నడిస్తే, నీడ మన వెనుకనే మనకి తెలియకుండా మనతో వస్తుంది. సూర్యుని లక్ష్యంగా పెట్టుకుని నడిచినట్టుగా, అదే విధంగా శాస్త్రములు చెప్పిన లక్ష్యాలను సాధించడం కోసం మనం నడుస్తూ ఉంటే, ధనము, కీర్తి వాటంతట అవే మన వెనుక వస్తాయి. (సూర్యుని వైపు నడుస్తూ ఉండగా మన నీడ మనతో వచ్చినట్లు.) అలా కాకుండా, మనం సూర్యుడిని విడిచిపెట్టి, వెనుకకు తిరిగి నీడని అనుసరించడం మొదలు పెడితే, మనం ఆ నీడని ఎన్నటికీ పట్టుకోలేము. చివరికి ఆ నీడ మనల్ని వదిలేస్తుంది. అంటే మనం శాస్త్రములు విధించిన సూర్యుడి వంటి ఉన్నతమైన లక్ష్యాలను వదిలిపెట్టి, ధనము/కీర్తి అనే అల్పమైన (నీడ వంటి) లక్ష్యాల వెనుక పడితే, అవి ఒకనాడు మనల్ని విడిచిపెట్టి పోతాయి. కాబట్టి శాస్త్ర విహితమైన ఉన్నత లక్ష్యాలను మాత్రమే మనం జీవితం యొక్క ప్రథాన లక్ష్యాలుగా ఉంచుకుని నడవాలి, మిగతా ధనము, కీర్తి వగైరా అనుషంగికముగా, మనకి ఎంత అవసరమో ఈశ్వరుడే కటాక్షిస్తాడు".

శ్రీపరమాచార్య స్వామి వారి పై వాక్కులను చదివాక, పూజ్య గురువు గారు శ్రీ రామాయణం ప్రవచనం చేస్తూ ఉండగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమిటంటే...
"నేను ధనము, కీర్తి, ఇంద్రియ సుఖాలు, సంసారము అనే గొడవలో పడి, నా జీవితపు ప్రథాన లక్ష్యం విస్మరిస్తున్నానా?? అని ప్రతీ మానవుడు తరచుగా ఆత్మపరిశీలన (self-check) చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనం జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని/లక్ష్యాన్ని సాధించడంలో, అసలు మన జీవిత ప్రథాన ప్రయోజనాన్ని విస్మరిస్తాము. మనం ఏదైతే లక్ష్యం కోసం అత్యధిక సమయం, శ్రమ, ఆలోచనలు ఖర్చు చేస్తున్నామో, అవి మనల్ని మన యొక్క పరమ ప్రయోజమైన ఆత్మోన్నతి వైపుకు తీసుకువెళ్ళేందుకు దోహదపడుతున్నాయా... అని ఆలోచించుకోవాలి.

ఇక్కడ పూజ్య గురువు గారు మరొక మాట కూడా చెప్పారు..."డబ్బు, కీర్తి సంపాదించవద్దని మన శాస్త్రం ఎన్నడూ చెప్పలేదు. ధర్మబద్ధముగా, నీతిగా డబ్బు సంపాదించమని మన శాస్త్రం చెప్పినది. అలాగే సత్కీర్తి సంపాదించడమూ తప్పు కాదు. కానీ శాస్త్రం అన్నిటినీ ధర్మంతో ముడివేయమని చెప్పినది. ధనం సంపాదించడం అనేది తృష్ణగా మారకూడదు, కీర్తి సంపాదించడం అనేది కీర్తి కండూతిగా మారకూడదు. ఇలా మారితే, ధనార్జన తృష్ణ వల్లన, కీర్తి కండూతి వలన, మనిషి తన యొక్క పరమ పద లక్ష్యాన్ని విస్మరించి, విచక్షణ కోల్పోయి, ఎంతో విలువైన ఈ మానవ జన్మ వృధా చేసుకుంటాడు.

అందుకనే ఎప్పుడూ గురువాక్య శ్రవణం చేస్తూ ఉంటే, మన జీవితానికి ఏది పరమ లక్ష్యమో, అలాగే ఇహములో కావలసిన విభూతులను కూడా ధర్మ బద్ధముగా ఎలా సంపాదించాలో, అలా సంపాదిస్తున్నా, ఆయా విభూతుల యందు లౌల్యం పెట్టుకుని క్రిందకి పడిపోకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహాన్ని, తపో పటిమని గురువు గారు కటాక్షిస్తారు.

అందుకనే పెద్దలు గురువు యొక్క వాక్కులను సింహనాదం అన్నారు. అడవిలో సింహము యొక్క నాదం వింటే, మిగతా జంతువులన్నీ చెల్లాచెదురై పారిపోతాయి. అలానే గురువు యొక్క సింహనాదం విన్న శిష్యుడికి, అతనిలోని ఆసురీ గుణాలు (కామ,క్రోధ, మద మాత్సర్యాలు వగైరా..) దూరంగా వెళ్ళిపోతాయి, అంతే కాక, గురువు యొక్క పాదములు పట్టుకుంటే, గురువు యొక్క అనుగ్రహంతో, ఇహములో తనకి కావలసినవన్నీ ధర్మబద్ధముగా సమకూరుతాయి, గురువాక్యములను ఆచరణలో పెట్టి సాధన చేయగా చేయగా... ఒకనాడు అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని కూడా గురువు కటాక్షిస్తాడు.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

27, మే 2013, సోమవారం

శ్రీ పరమాచార్య వాణి # పాపపుణ్యముల విచారణపై అర్జునుడికి శ్రీకృష్ణ సందేశం


"మహాభారత యుద్ధం చేయడానికి ముందు, "బంధు మిత్రులను యుద్ధంలో సంహరించి, రాజ్యాన్ని పొందడం పాపం కాదా?" అని అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మని అడుగుతాడు. ఈ ప్రశ్నకి సమాధానం గీతలోనే శ్రీకృష్ణపరమాత్మ చెప్పి ఉన్నారు. ఇక్కడ సాంరాంశం ఏమిటంటే, మన కంటికి 'క్రూరము' గా లేక 'చెడు' గా కనిపించినవన్నీ పాపభూయిష్టమైన కర్మలు కానవసరం లేదు. బాహ్యంలో ఇతరులకు నొప్పి కలిగించినట్టుగా కనబడిన ఒక చర్య, మొత్తం లోకానికి మేలు చేకూర్చగలిగితే అది పాపం కాదు.
ఇలా అయితే ఒక సందేహం కలుగవచ్చు. మరి ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పాపం కానిది లేదా పుణ్యమో ఎలా నిర్ధారించేది? గీతలోనే కృష్ణ పరమాత్మ దీనికి సమాధానం చెప్పారు.
"కామముతో మరియు ద్వేషముతో ప్రేరేపింపబడిన చేష్టితములు పాపముగానూ" - "కామము మరియు ద్వేషము అనేవి లేకుండా, కేవలం లోకక్షేమాన్ని ఉద్దేశించి చేసే పనులు పుణ్యములుగానూ, అటువంటి లోకక్షేమకారక కార్యములలో కొన్ని, బాహ్యంలో క్రూరముగా కనిపించినా అవి పాపముగా పరిగణింపబడవు" అని గీతాచార్యుడి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

26, మే 2013, ఆదివారం

శ్రీ పరమాచార్య వాణి - నిత్య సత్కర్మాచరణ ఆవకశ్యత

"మన వద్ద ఒక రాగి పాత్ర ఉన్నదనుకోండి, దానిని ఈ రోజు శుభ్రం చేస్తే తళ తళా మెరుస్తుంది, మరి రేపు లేక ఎల్లుండి మాటేమిటి? రాగి పాత్రని ప్రతీ రోజూ శుభ్రం చేయకపోతే, మళ్ళీ మలినం పట్టినట్లుగా, మన మనసు కూడా ప్రతీ రోజూ మనం విహితకర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మన మనసు మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మాచరణము చేయగా చేయగా, ఒకనాడు చిత్తశుద్ది ఏర్పడి, ఆపైన ఆత్మ దర్శనం అవుతుంది. అలా ఒక్కసారి ఆత్మదర్శనం పొందాక, ఇక ఇలా ప్రతీ రోజూ విహితకర్మాచరణ, సత్కర్మలు వగైరా ఏమీ చేయనక్కరలేదు. కానీ ఆ స్థితిని పొందేవరకు వేదం చెప్పినట్లుగా విహిత కర్మలు, సత్కర్మలు చేయవలసినదే".

ఈ విషయమై, పూజ్య గురువు గారి వాక్కుల నుంచి, నాకు గుర్తు ఉన్న సారాంశం...

"అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడ్డ మహాపురుషులు మన ఈ భరత ఖండములో అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి భగవాన్ రమణులు. రమణుల వంటి మహాపురుషులు ఏమి చెప్తారో అది మనకి శిరోధార్యం తప్ప, రమణులు చేసినవన్నీ మనకి ఆచరణీయము కావు. వారు తురీయావస్థని దాటి ఉన్న మహాత్ముడు, ఆయనలా మనం చేయాలనుకోవడం తప్పు. అందుకే మహాత్ములను ఎన్నటికీ అనుకరించవద్దు. మహాత్ములు చెప్పిన బోధలను మనం ఆచరణలో పెడితే చాలు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయరు అని నాబోటి అల్పుడు వారిని చూసి, నేను కూడా ఉన్నదంతా ఒకటే కదా అనే కృతక వైరాగ్యం తెచ్చిపెట్టుకునో, మనసులో ఉంటే చాలండీ... చేస్తేనే భక్తి ఉన్నట్లా అనో మెట్ట వేదాంతం కబుర్లు చెప్పుకునో, సంధ్యావందనం మానేసాననుకోండీ, ఇక అంతకన్నా భ్రష్టత్వం మరొకటి ఉండదు.

అందువల్ల, మహాత్ముల స్థాయికి వెళ్ళేవరకు,
ప్రతీ ఒక్కరికి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టీ, వేదం విహించిన నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, సత్కార్యాలు ఆచరించవలసినదే. రాగి పాత్ర ఉంటే ప్రతీ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లు, మనకి చిత్తశుద్ధి కలిగేవరకు విహితకర్మాచరణ ప్రతీ రోజూ చేస్తూ ఉండవలసినదే".
 

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

25, మే 2013, శనివారం

శ్రీ పరమాచార్య వాణి - సత్కర్మాచరణ ఆవకశ్యత

"ఒక రాగి పాత్రను ఒక పది సంవత్సరాల పాటు ఒక బావినీటిలో పడవేసి ఉంచారనుకోండి, ఆ తర్వాత ఎంత సేపు దానిని చింతపండుతో రుద్దితే, ఆ పాత్రకి పట్టిన కిలుం వదిలిపోతుంది? రాగి పాత్రని మనం ఎంతగా రుద్ది శుభ్రం చేస్తే, అది అంతలా మెరుస్తుంది. అదే విధముగా మన మనసు కూడా ఎన్నో సంవత్సరాలపాటు చెడు (పాప) కర్మలను చేయడం వలన, చెడు మాట్లాడడం వలన మలినం అయిపోయింది. మన మనసు మళ్ళీ పవిత్రం అవ్వాలంటే, ఎన్నో మంచి పనులను, సత్కార్యాలను చేస్తూ ఉండడం వల్ల, ఆ చెడ్డ కర్మల వల్ల కలిగిన మాలిన్యం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది".

శ్రీపరమాచార్య స్వామి వారి పై బోధకి సంబంధించి, పూజ్య గురువు గారి వాక్కుల ద్వారా నేను తెలుసుకున్న మరి కొంత వివరణ....


ఇక్కడ మంచిపనులు  అంటే, ఏ కర్మలను/పనులను వేదం ఒక వ్యక్తికి 

విహిత కర్మలుగా గుర్తించినదో ఆ కర్మలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం, ఏ కర్మలను చేయవద్దు అని నిషిద్ధ కర్మలుగా వేదం చెప్పినదో, వాటిని చేయకుండా ఉండడం. విహిత కర్మాచరణ చేస్తూ ఉండడం, నిషిద్ధ కర్మల జోలికి కూడా వెళ్లకుండా ఉండడం, గురువులను, పెద్దలను సేవించడము, గురువు గారి అనుమతి/సూచనల మేరకు మాత్రమే దానములు/లోకోపకార పనులు చేయడము, సత్సాంగత్యము నెరపడము.
మంచి పనులు చేయమన్నారు కదా... ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్లకి మన ఇచ్చ వచ్చినట్లు దానాలు చేసేస్తే "నువ్వు పాడైపోతావు" అని శాస్త్రం చెప్పినది. అందుకే, మనం ఒక మంచి పని అనుకుని, ఆ పని చేసేముందు, గురువుల/పెద్దల అనుమతితో చేయడం మంచిది అని పూజ్య గురువు గారి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

24, మే 2013, శుక్రవారం

శ్రీ పరమాచార్య వాణి - కామక్రోధములను అదుపులో పెట్టాలి


"ఒక కోరిక తీరగానే వెనువెంటనే మరో కోరిక పుడుతుంది, అదే ఏదైనా కోరిక నెరవేరకపోతే, ఆ కోరిక తీరకపోవడం వల్ల వచ్చిన దుఃఖం క్రోధంగా పరిణమిస్తుంది. ఈ కామక్రోధాల వలలో చిక్కిన వ్యక్తి నెమ్మదిగా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, పోను పోను అతను చేసే అన్ని పనులు కూడని రీతిలో/చెడుగా చేసే దిశగా వెడతాడు. ఎవరైతే ఈ కామాన్ని, ఒక యజమాని సేవకుడిని అదుపులో పెట్టినట్లు, అదుపులో పెట్టుకుంటాడో, వాడు మాత్రమే, ఆత్మ దర్శనం వైపు అడుగులు వేయగలుగుతాడు".

ఇక్కడ శ్రీ పరమాచార్య స్వామి వారు చెప్పిన వాక్కులతో పాటు, పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కొన్ని మాటలు కూడా స్మరిద్దాము...

"మొదటగా ఇక్కడ కామం అంటే ఎల్లప్పుడూ స్త్రీ పురుష సంబంధమైన తుచ్ఛ కామం ఒక్కటే కాదు అని మనం అర్ధం చేసుకోవాలి. అన్ని రకాల కోరికలను కామం అనే అంటారు. ఈ కామాన్ని ఎవడు అదుపులో పెట్టుకుంటారో వాడు ఆత్మ దర్శనం పొందే దిశగా అడుగులు వేస్తాడు. అదుపులో పెట్టడం అంటే త్రొక్కిపెట్టడం కాదు. (
కామాన్ని త్రొక్కిపెడితే, అది ఒకనాడు ప్రతిఘటించి త్రాచుపాములా కాటువేయగలదు, అప్పుడు ఇన్నాళ్ల తపస్సు కూడా వ్యర్ధం అవుతుంది. దీనికి ఉదాహరణ రావణాసురుడు) అందుకే మన శాస్త్రం, దీనిని ధర్మంతో ముడి వేసింది. ధర్మముతో కూడిన కామము, ధర్మముతో కూడిన అర్ధములను, శాస్త్రం/వేదం చెప్పినట్లుగా అనుభవించవచ్చు. ఈ ధర్మము, అర్ధము, కామము అనే మూడు పురుషార్ధాలను పట్టుకుంటే, నాలుగవ పురుషార్ధమైన మోక్షం అనుషంగికము.

అర్ధ, కామములను రెండిటినీ ధర్మముతో ముడి వేసి పట్టుకున్నవాడికి, మోక్షం అడగకుండానే వస్తుంది అని పూజ్య గురువు గారి వాక్కు.

అందుకే పూజ్య గురువు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మనం ధర్మబద్ధముగా అర్ధమును సంపాదిస్తూ, ధర్మబద్ధముగా కామము అనుభవిస్తూ ఉంటే, నెమ్మదిగా మనలో ఒక విచారణ మొదలవుతుంది, మనం ఏదైతే సుఖము అనుకుని దీనిని పట్టుకున్నామో .. ఇది అసలు సుఖమా? అని. ఉదాహరణకి నాకు
చక్కెర పొంగలి తినడం అనే కోరిక పుట్టింది, నా ధర్మపత్నికి ఈ రోజు, స్వామి వారికి నివేదన కోసం చక్కెర పొంగలి చేయమని చెప్పాను, తీరా భార్య ప్రసాదం తీసుకువచ్చి కంచంలో వడ్డిస్తే, ఒకసారి తినగానే సంతోషం, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ భార్య తీసుకువచ్చి  అదే చక్కెరపొంగలి వడ్డించేస్తోందనుకోండి, అప్పుడు వెగటు పుడుతుంది... అప్పుడు ఇప్పటిదాకా చక్కెర పొంగలి కావాలి అన్నవాడు, వెగటు పుట్టి వద్దంటాడు.

అంటే ఏమిటి దానర్ధం, ఈ క్షణానికి 'సుఖము'గా కనబడినది, కాస్సేపటికి 'దుఃఖము'గా పరిణమించినది. అంటే నేను దేనినైతే సుఖము సుఖము అనుకుని తిరుగుతున్నానో అది నిజమైన సుఖము కాదు అన్న భావన మనసులో స్థిరీకరింపబడి, ఒకనాడు వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలగడమే, జ్ఞానమును పొంది, తనలోనే ఉన్న భగవంతుడిని దర్శించి, తరగని ఆత్మానంద స్థితిని అనుభవిస్తాడు.

అలా ఆత్మ స్థితిని చేరుకోవాలంటే ప్రథానమైన మెట్టు ధర్మము. ధర్మముతో అర్ధ, కామములను పట్టుకుని, ఈశ్వరుడు ఇచ్చిన దానిలో, శాస్త్రము, గురువు చెప్పినట్లుగా జీవితాన్ని గడపితే, గురువు అనుగ్రహంతో, మళ్ళీ ఈ జననమరణ చక్రములో పడకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య సన్నిధిని పొందుతాము.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

23, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలి


"మనం ఎవరినైనా, వారిలో ఉన్న సద్గుణాలను నిజాయితీగా ప్రశంస చేయడం వల్ల, ఆ వ్యక్తి మరింత ప్రోత్సాహము పొంది, ఆతనిలో ఉన్న ఆ సద్గుణములను మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాగని ప్రశంస చేయడంలో తగు జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదే పనిగా ప్రశంస చేయడం సరికాదు, ఇది చాలా సున్నితమైన అంశం. ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలని విజ్ఞులైన పెద్దలు చెబుతారు. స్నేహితులు, బంధువుల గురించి, వారిని ప్రత్యక్షంగా ప్రశంస చేయడం కన్నా, ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి సద్గుణములను ప్రశంసించడం మంచిది. యజమాని, తన సేవకుడికి అప్పజెప్పిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాతనే ప్రశంస చేయాలి. ఒక తండ్రి తన కొడుకుని ప్రత్యక్షంగా ఎప్పుడూ ప్రశంస చేయకూడదు".

యజమాని సేవకుడిని ప్రశంస చేసే విషయంలో గొప్ప ఉదాహరణ, శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ దర్శనం చేసి వచ్చిన హనుమని కౌగలించుకుని, హనుమా నువ్వు నా సోదరుడు భరతుడితో సమానం, నీ ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను, నీవు చేసిన సహాయం నాలో జీర్ణమైపోవుగాక అని చెప్తారు కదా. పైన యజమాని సేవకుడిని ఎప్పుడు ప్రశంసించాలి అని చదువుతూ ఉంటే, శ్రీరామ హనుమల ఆలింగనం గుర్తుకు వచ్చింది.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

22, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురువైభవం

"గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడికి, గురువుకి ఒక్కటే తేడా. ఈశ్వరుడు సృష్ఠి, స్థితి లయములనే మూడు పనులు చేస్తూ ఉంటారు, గురువు ఈ మూడూ చెయ్యనవసరంలేదు. మనం గురువు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచితే, భగవంతుడిలో చేర్చేందుకు కావలసిన జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. మనకి ఒక గురువు లభించనప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా భగవంతుని పాదములు పట్టుకోవాలి".

పైన చెప్పిన పరమాచార్య స్వామి వారి బోధను చదివాక మరియు పూజ్య గురువు గారి వాక్కుల నుంచి నాకు అర్ధం అయిన సారాంశం...


"అందుకే కదా గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని కదా గురుగీతలో శంకరుడు చెప్పారు. త్రిమూర్త్యాత్మకుడైన గురువుని నమ్మితే, గురువు యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడిలో కలిసేలా చేస్తాడు. అదే మనకి గురువు లభించకపోతే, తదేక దీక్షతో మన ఇలవేల్పు/కులదైవాన్ని/ఇష్టదైవాన్ని అనన్య భక్తితో కొలుస్తూ ఉంటే, ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు, ఒకనాడు తానే స్వయంగా గురువు రూపంలో వచ్చి, మనకి జ్ఞాన భిక్ష పెట్టి మనల్ని అంత్యమున ఆయనలో చేర్చుకుంటాడు. అంటే గురువు లభించాక భగవంతుడిని పూజించనక్కరలేదు అని కాదు దీని భావం, గురువు లభించని పూర్వం మనం చేసే పూజతో పోలిస్తే, గురువు లభించిన తర్వాత మనం చేసే పూజలో ఊహించలేనంత ఉన్నతి ఉంటుంది. గురువు లభించిన తర్వాత, ప్రత్యక్షంగా గురువుకి చేసే సేవ మరియు గురుబోధలననుసరించి, మనం చేసే వైదిక కర్మాచరణ అన్నీ పరిపూర్ణత్వం పొంది,  తద్వారా, గురువు అనుగ్రహంతో చిత్తశుద్ధి కలిగి, ఆపై గురువు అనుగ్రహంతోనే జ్ఞానం పొందడానికి అర్హత లభిస్తుంది."

న గురోరధికం న గురోరధికం న గురోరధికం నగురోరధికం
శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

15, మే 2013, బుధవారం

జగద్గురు శ్రీ ఆదిశంకరభగవత్పాదాచార్య స్తవం - శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం

శ్రీ గురుభ్యో నమః


II శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం శ్రీ జగద్గురు శంకరభగవత్పాదాచార్య స్తవః II

ముదాకరేణ పుస్తకం దధాన మీశ రూపిణం
తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీం I
కుసుంభవాససా
ఽవృతం విభూతిభాసిఫాలకం
నతాఘనాశనే రతం నమామి శంకరం గురుమ్ II 1

పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం
పురాణసారవేదినం సనందనాదిసేవితం I
ప్రసన్నవక్త్రపంకజం ప్రసన్నలోకరక్షకం
ప్రకాశితా
ఽద్వితీయ తత్త్వమాశ్రయామి దేశికమ్ II 2

సుధాంశుశేఖరార్చకం సుధీంద్రసేవ్యపాదుకం
సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకం I
సమస్తవేదపారగం సహస్ర సూర్య భాసురం
సమాహితాఖిలేంద్రియం సదా భజామి శంకరమ్ II 3

యమీంద్రచక్రవర్తినం యమాదియోగవేదినం
యథార్ధ తత్త్వబోధకం యమాంతకాత్మజార్చకం I
యమేవ ముక్తి కాంక్షయా సమాశ్రయంతి సజ్జనాః
నమామ్యహం - సదా గురుం తమేవ శంకరాభిధమ్ II 4

స్వబాల్య ఏవ నిర్భరం య ఆత్మనో దయాలుతాం
దరిద్ర విప్ర మందిరే సువర్ణవృష్టి మానయన్ I
ప్రదర్శ్య విస్మయాంబుధౌ న్యమజ్జయత్సమాన్ జవాన్
స ఏవ శంకర స్సదా జగద్గురు ర్గతి ర్మమ II 5

యదీయ పుణ్య జన్మనా ప్రసిద్ధి మాప కాలడీ
యదీయ శిష్యతాం వ్రజన్ స తోటకోఽపి పప్రథే I
య ఏవ సర్వ దేహినాం విముక్తి మార్గదర్శకః
నరాకృతిం సదాశివం త మాశ్రయామి సద్గురుమ్ II 6

సనాతనస్య వర్త్మనః సదైవ పాలనాయ యః
చతుర్దిశాసు సన్మఠాన్ చకార లోక నిశ్రుతాన్ I
విభాండకాత్మజాశ్రమాది సుస్థలేషు పావనాన్
తమేవ లోకశంకరం నమామి శంకరం గురుమ్ II 7

యదీయహస్తవారిజాత సుప్రతిష్ఠితా సతీ
ప్రసిద్ధ శృంగభూధరే సదా ప్రశాంతి భాసురే I
స్వభక్తపాలనవ్రతా విరాజతే హి శారదా
స శంకరః కృపానిధిః కరోతు మా మనేనసమ్ II 8

ఇమం స్తవం జగద్గురో ర్గుణానువర్ణనాత్మకం
సమాదరేణ యఃపఠే దనన్య భక్తి సంయుతః I
సమాప్నుయా త్సమీహితం మనోరథం నరో
ఽచిరాత్
దయానిధే స్స శంకరస్య సద్గురోః ప్రసాదతః II 9

II ఇతి శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం శ్రీ జగద్గురు శంకరభగవత్పాదాచార్య స్తవః సంపూర్ణం II

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
 

17, జనవరి 2013, గురువారం

శివపురాణాంతర్గత రుద్రాధ్యాయసార స్తోత్రం

II విష్ణు ఉవాచః II
నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే I
కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః II
త్వం హి విశ్వసృపాం స్రష్టా ధాతా తవం ప్రపితామహః I
త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతైః పురుషాత్పరః II

నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే I
విశ్వాయ విశ్వబీజాయ జగదానన్దహేతవే II
ఓంకారస్త్వం వషట్కార స్సర్వారంభ ప్రవర్తకః I
హన్తకారస్స్వధాకారో హవ్యకవ్యాన్నభుక్ సదా II 

నమస్తే భగవన్ రుద్ర భాస్కరామితతేజసే I
నమో భవాయ దేవాయ రసాయాంబుమయాయ చ II
శర్వాయ క్షితిరూపాయ సదా సురభిణే నమః I
రుద్రాయాగ్నిస్త్వరూపాయ మహాతేజస్వినే నమః II

ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః I
మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోఽస్తు తే II
పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేధసే I
భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః II

ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే I
నమస్తే కాలకాలాయ నమస్తే రుద్ర మన్యవే II
నమః శివాయ భీమాయ శంకరాయ శివాయ తే I
ఉగ్రోఽసి సర్వభూతానాం నియంతా యఛ్చివోఽసి నః II

మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే హయార్తినాశనే I
అంబికాపతయే తుభ్యముమాయాః పతయే నమః II
శర్వాయ సర్వరూపాయ పురుషాయ పరమాత్మనే I
సదసద్వ్యక్తిహీనాయ మహతః కారణాయ తే II

జాతాయ బహుధా లోకే ప్రభూతాయ నమో నమః I
నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే II
మీఢుష్టమాయ దేవాయ శిపివిష్టాయ తే నమః I
మహీయసే నమస్తుభ్యం హన్త్రే దేవారిణాం సదా II

తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే I
హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః II
దేవాయ శంభవే తుభ్యం విభవే పరమాత్మనే I
పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః II

హిరణ్యాయ పరేశాయ హిరణ్య వపుషే నమః I
భీమాయ భీమరూపాయ భీమకర్మరతాయ చ II
భస్మాదిగ్ధశరీరాయ రుద్రాక్షాభరణాయ చ I
నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమోఽస్తు తే II

దూరేవధాయ తే దేవాగ్రేవధాయ నమో నమః I
ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః II
నానాయుధధరాయైవ దైత్యదానవనాశినే I
సద్యాయ సద్యరూపాయ సద్యోజాతాయ వై నమః II

వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః I
అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః II
తత్పురుషాయ నాథాయ పురాణపురుషాయ చ I
పురుషార్ధప్రదానాయ వ్రతినే పరమేష్ణినే II

ఈశానాయ నమస్తుభ్యమీశ్వరాయ నమో నమః I
బ్రహ్మణే బ్రహ్మరూపాయ నమః సాక్షాత్పరాత్మనే II
ఉగ్రోఽసి సర్వదుష్టానామ్ నియంతాసి శివోఽసి నః I
కాలకూటాశినే తుభ్యం దేవాద్యవనకారిణే II

వీరాయ వీరభద్రాయ రక్షద్వీరాయ శూలినే I
మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః II
వీరాత్మనే సువిద్యాయ శ్రీకంఠాయ పినాకినే I
నమోఽనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే II

పరాయ పరమేశాయ పరాత్పరతరాయ చ I
పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే II
నమో విష్ణుకళత్రాయ విష్ణుక్షేత్రాయ భానవే I
భైరవాయ శరణ్యాయ త్ర్యంబకాయ విహారిణే II

మృత్యుంజయాయశోకాయ త్రిగుణాయ గుణాత్మనే I
చంద్రసూర్యాగ్నినేత్రాయ సర్వకారణహేతవే II
భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా I
బ్రహ్మవిష్ణ్వింద్రచంద్రాది ప్రముఖాః సకలాస్సురాః II

మునయశ్చాపరే త్వత్తసంప్రసూతా మహేశ్వర I
యతో బిభర్షి సకలం విభ్యజ్య తనుమష్టధా II
అష్టమూర్తిరితీశశ్చ త్వమాద్యః కరుణామయః I
త్వద్భయాద్వాతి వాతోఽయం దహత్యగ్నిర్భయాత్తవ II

సూర్యస్తపతి తే భీత్యా మృత్యుర్భీతావతి సర్వతః I
దయాసింధో మహేశాన ప్రసీద పరమేశ్వర II
రక్ష రక్ష సదైవాస్మాన్ యస్మాన్నష్టాన్ విచేతసః I
రక్షితాస్సతతం నాథ త్వయైవ కరుణానిధే II
నానాపద్భ్యో వయం శంభో తవైవాద్య ప్రపాహి నః II

II ఇతి శివమహాపురాణే రుద్రసంహితాయాం సతీఖండే రుద్రాధ్యాయసార స్తోత్రం సంపూర్ణమ్ II
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

2, జనవరి 2013, బుధవారం

అరుణాచల అక్షరమణమాల



భగవాన్ రమణ మహర్షి స్వయముగా చేసిన అరుణాచలేశ్వరుని స్తుతి ఈ "అరుణాచల అక్షరమణమాల". భగవాన్ ఒకరోజు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆసువుగా, ఆయన నోటి ఉండి వచ్చిన అరుణాచలేశ్వరుని స్తుతి. భగవాన్ రమణులు చేసిన ఈ స్తుతిని అక్షరమణమాలై అని అంటారు, అది తమిళంలో ఉంటుంది. కానీ శ్రీరమణాశ్రమం వారు, భగవాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన స్తుతిని తెలుగులో అనువదింపజేశారు. ఈశ్వరుని నిర్హేతుక కృప వలన, పూజ్య గురువు గారి ఆశీస్సుల ఫలముగా, మాకు అరుణాచలేశ్వరుని, రమణాశ్రమమును దర్శించుకునే భాగ్యం కలిగినది. అప్పుడు రమణాశ్రమములో ఈ అరుణాచల-అక్షరమణమాల తెలుగు పుస్తకము లభించినది.  ఈ స్తోత్రం యొక్క తెలుగు లిపి, అంతర్జాలములో కూడా ఉంటే బావుంటుంది అనే చిన్న కోరికయే ఈ ప్రయత్నానికి కారణం. ఇందులో ఏమైనా అక్షర దోషములు ఉంటే, అరుణాచలేశ్వరుడు నన్ను క్షమించుగాక.


అరుణాచలశివ  - అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా
                          అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా ।।

పూర్తి శ్లోకము కావలసిన వారు ఈ క్రింద లంకెలో PDF రూపములో ఉన్న ప్రతిని దింపుకుని పారాయణ చేయవచ్చు.
ఈ అరుణాచల అక్షరమనమాల తెలుగులో గానం చేయబడిన mp3 ఈ క్రింద లంకె నుండి దింపుకోగలరు.
@ శ్రీరమణాశ్రమము వారి సౌజన్యముతో
ఓం అరుణాచలేశ్వరాయ నమః
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు